అవి..ఇవీ..

CVSR డైలీ రౌండప్ – 17-07-2026

నింగిని తాకే కొత్త అడుగు Iప్రైవేట్ రాకెట్ గర్జనకు సిద్ధమైన శ్రీహరికోట ISriharikota Set for India’s Private Rocket Moment

భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీహరికోట వేదిక కానుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-వన్‌ను India’s Private Rocket జూలై 18న ఉదయం 11.30 గంటలకు షార్ కేంద్రం నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిషన్ ఆగమన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగం, దేశంలో ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్‌ను భూ కక్ష్యలోకి పంపే తొలి కీలక ప్రయత్నంగా నిలవనుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ సంస్థల ఆధిపత్యంలో కొనసాగిన ప్రయోగ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కొత్త దిశను సూచిస్తోంది. సాంకేతిక పరీక్షలు, భద్రతా సమీక్షలు, ప్రయోగ వేదిక అనుసంధాన ప్రక్రియలు పూర్తికావడంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

స్వదేశీ సాంకేతికతకు పరీక్ష

సుమారు ఏడు అంతస్తుల ఎత్తు కలిగిన విక్రమ్-వన్ రాకెట్‌ను అధునాతన కార్బన్ కాంపోజిట్ నిర్మాణాలు, త్రీడీ ప్రింటెడ్ ఇంజన్ భాగాలు, ఘన ఇంధన బూస్టర్లతో రూపొందించారు. సుమారు 350 కిలోల చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడం దీని ప్రధాన లక్ష్యం. రాకెట్ అసెంబ్లీ, వ్యవస్థల అనుసంధానం, ఏవియానిక్స్ పరీక్షలు, టెలిమెట్రీ తనిఖీలు పూర్తైనట్లు తెలుస్తోంది. గ్రహాస్పేస్, కాస్మో సెర్చ్ సంస్థలకు చెందిన పేలోడ్లతో పాటు ఒక సూక్ష్మ కళాఖండాన్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ప్రయోగం విజయవంతమైతే చిన్న ఉపగ్రహాల మార్కెట్‌లో భారత ప్రైవేట్ రంగానికి విశ్వసనీయత పెరుగుతుంది.

మిషన్ పేరులోనే సందేశం

ఆగమన్ అంటే రాక లేదా కొత్త ప్రవేశం. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశాన్ని ప్రతిబింబించేలా ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-వన్‌పై భారత జాతీయ పతాకం, స్కైరూట్ ఏరోస్పేస్ గుర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రయోగాన్ని శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక నమోదు ప్రక్రియను అందుబాటులో ఉంచారు. ప్రత్యక్ష ప్రసారం కూడా ప్రయోగానికి గంట ముందుగా ప్రారంభం కానుంది. అయితే వాతావరణం, రేంజ్ క్లియరెన్స్, తుది సాంకేతిక సిద్ధత ఆధారంగా ప్రయోగ సమయం మారే అవకాశం ఉంటుంది. అందువల్ల అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

ఇస్రోకు పరోక్ష ఆదాయం

ప్రైవేట్ సంస్థ ప్రయోగించే రాకెట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం నేరుగా ఇస్రోకు చేరదు. అయితే ఇస్రోకు చెందిన లాంచ్ ప్యాడ్లు, పరీక్షా కేంద్రాలు, ట్రాకింగ్ రాడార్లు, టెలిమెట్రీ వ్యవస్థలు, మిషన్ సపోర్ట్ సేవలను వినియోగించినందుకు రుసుములు లభిస్తాయి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్-స్పేస్ వంటి సంస్థలు వాణిజ్య ఒప్పందాలు, అనుమతులు, మౌలిక సదుపాయాల వినియోగాన్ని సమన్వయం చేస్తాయి. ప్రైవేట్ ప్రయోగాలు పెరిగితే దేశీయంగా తయారయ్యే ఇంజన్లు, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, నిర్మాణ భాగాలు, పరీక్షా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికతకు లైసెన్సింగ్ అవకాశాలు పెరగడం ద్వారా ప్రభుత్వ రంగానికీ దీర్ఘకాలిక వాణిజ్య ప్రయోజనం కలుగుతుంది.

శాస్త్రీయ మిషన్లకు సమయం

ప్రతి చిన్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రోనే నిర్వహించాల్సి వస్తే శాస్త్రీయ, వ్యూహాత్మక కార్యక్రమాలపై ఒత్తిడి పెరుగుతుంది. విక్రమ్-వన్ వంటి ప్రైవేట్ రాకెట్లు చిన్న ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి పంపే బాధ్యతను చేపడితే, ఇస్రో గగన్‌యాన్, చంద్ర, సౌర, గ్రహ పరిశోధన మిషన్లు, కొత్త తరహా ప్రయోగ వాహనాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టగలదు. చిన్న ఉపగ్రహ వినియోగదారులకు కూడా వేచి ఉండే సమయం తగ్గుతుంది. వారికి కావాల్సిన తేదీ, కక్ష్య, వంపు కోణానికి అనుగుణంగా ప్రత్యేక ప్రయోగ సేవలు లభించే అవకాశముంది. ఈ సౌలభ్యం భారత ప్రయోగ సేవలకు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ సామర్థ్యాన్ని పెంచే అంశంగా మారుతుంది.

ప్రపంచ మార్కెట్ వైపు భారత్

అమెరికా, యూరప్, రష్యా, చైనా వంటి దేశాల్లో ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ముందుగానే బలమైన స్థానం సంపాదించాయి. భారత్‌లో 2023 అంతరిక్ష విధానం అమల్లోకి రావడంతో రాకెట్లు, ఉపగ్రహాలు, గ్రౌండ్ సిస్టమ్స్, అంతరిక్ష డేటా సేవల్లో ప్రైవేట్ సంస్థలకు విస్తృత అవకాశాలు లభించాయి. విక్రమ్-వన్ ప్రయోగం ఆ విధాన మార్పుల ఫలితాలు కనిపించడం ప్రారంభమైన సంకేతంగా భావించవచ్చు. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించే సేవాదారుగా మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి అంతరిక్ష ఉత్పత్తులు, సాంకేతికత, సేవలను ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదగాలనే లక్ష్యం స్పష్టమవుతోంది. ఈ మార్పు హైస్కిల్ ఉద్యోగాలు, పరిశోధన పెట్టుబడులు, స్టార్టప్ సంస్కృతి, విదేశీ పెట్టుబడులకు కొత్త అవకాశాలు తెరుస్తుంది.

విజయం అంటే కక్ష్యలోనే

ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ప్రయోగంలో పైకి ఎగరడం ఒక్కటే విజయం కాదు. ఇంజన్ల పనితీరు, దశల విభజన, మార్గదర్శక వ్యవస్థ, వేగం, ఎత్తు, పేలోడ్ విడిపోవడం, లక్ష్య కక్ష్యలో ఖచ్చితంగా ప్రవేశించడం వంటి అన్ని దశలు విజయవంతం కావాలి. ప్రయోగానికి ముందు సముద్ర, గగనతల ప్రాంతాలను ఖాళీ చేయడం, నౌకలు, విమానాలకు హెచ్చరికలు జారీ చేయడం, రాకెట్‌ను రాడార్లు, టెలిమెట్రీ ద్వారా నిరంతరం పర్యవేక్షించడం తప్పనిసరి. ప్రయోగ బీమా కూడా కీలక అంశం. రాకెట్ లేదా పేలోడ్ నష్టపోతే బాధ్యత ఎవరిది, పరిహారం ఎలా చెల్లించాలి, మూడో వ్యక్తులకు నష్టం జరిగితే ఎవరు భరించాలి వంటి అంశాలు ముందుగానే ఒప్పందాల్లో నిర్ణయించబడతాయి.

ఒక్క ప్రయోగమే తుది తీర్పు కాదు

విక్రమ్-వన్ విజయవంతమైనా, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం పూర్తిగా స్థిరపడిందని వెంటనే నిర్ణయించలేం. వరుస ప్రయోగాలు, సమయపాలన, తక్కువ వ్యయం, భద్రత, ఖచ్చితమైన కక్ష్య ప్రవేశం, వినియోగదారుల నమ్మకం దీర్ఘకాలిక విజయాన్ని నిర్ణయిస్తాయి. వైఫల్యం ఎదురైతే కారణాన్ని వేగంగా గుర్తించి, రూపకల్పన లోపాలను సరిచేసి, తదుపరి ప్రయోగానికి ఎంత త్వరగా సిద్ధమవుతారన్నది సంస్థ సామర్థ్యానికి పరీక్ష. అంతరిక్ష వ్యర్థాలు పెరగకుండా రాకెట్ చివరి దశలను సురక్షితంగా నిర్వహించడం కూడా బాధ్యతలో భాగమే. అయినప్పటికీ విక్రమ్-వన్ ప్రయోగం ప్రభుత్వ ఆధారిత అంతరిక్ష కార్యక్రమం నుంచి ప్రభుత్వం, పరిశ్రమ, స్టార్టప్‌లు కలిసి పనిచేసే విస్తృత వాణిజ్య వ్యవస్థ వైపు భారత్ అడుగులు వేస్తున్నదనే బలమైన సంకేతం.

బూట్లు ధరించలేదని విద్యార్థినికి శిక్షStudent punished for not wearing shoes

గుంజీలు తీయించడంతో స్పృహ తప్పిన ఎనిమిదో తరగతి విద్యార్థిని

ఏలూరు జిల్లా : బూట్లు ధరించకుండా పాఠశాలకు వచ్చిందనే కారణంతో ఎనిమిదో తరగతి విద్యార్థినికి వ్యాయామ ఉపాధ్యాయుడు శిక్ష విధించడంతో ఆమె స్పృహ తప్పిన ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలం వెల్పుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. బూట్లు ధరించకుండా పాఠశాలకు వచ్చినందుకు వ్యాయామ ఉపాధ్యాయుడు తనతో 25 గుంజీలు తీయించడంతోపాటు కొట్టినట్లు ఆరోపించింది. శిక్ష సమయంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఇతర సిబ్బంది సహాయంతో విద్యార్థినిని ఇంటికి పంపించారు. అయితే ఆమెకు తక్షణ వైద్యసాయం అందించకుండా ఇంటికి పంపించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు జూలై 16న విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయోధ్య విరాళాల గోల్‌మాల్: జూలై 20న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక

అయోధ్య రామమందిరం విరాళాల తస్కరణ ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నిధుల దుర్వినియోగంపై Ayodhya Donation Scam దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం (సిట్) సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జూలై 20న సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించనుంది. విరాళాలలో జరిగినట్లుగా భావిస్తున్న ఆర్థిక అక్రమాలపై తుది విచారణను పూర్తి చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి సిట్ మరికొంత సమయం కోరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారంతో తెలుస్తుంది. విరాళాల దుర్వినియోగంపై నిష్పాక్షికమైన, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

రామ్ మందిర్ నిధుల తస్కరణ కేసు

ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న లక్నో పోలీసు ఉన్నతాధికారుల, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శితో కూడిన ముగ్గురు సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి దర్యాప్తు పూర్తి చేయడానికి తొలుత 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆ గడువును మరో 15 రోజులు పొడిగించారు. జూన్ 23న సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన 9 పేజీల ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. సిట్ సమర్పించబోయే తుది నివేదిక ఆలయ పరిపాలన, విరాళాల లెక్కింపు విధానంలో సంస్కరణలను సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది.

రూ.609 కోట్ల ప్రభుత్వ, పార్కు భూములకు హైడ్రా రక్షణ

హైదరాబాద్: నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్కు స్థలాల పరిరక్షణకు హైడ్రా HYDRA Protects చర్యలు చేపట్టింది. జూలై 16న బంజారాహిల్స్‌లోని బంజారా సరస్సు సమీపంలో 3.63 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు హయత్‌నగర్, బోడుప్పల్ ప్రాంతాల్లో మూడు పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడింది. రక్షణ చర్యలు చేపట్టిన భూముల మొత్తం అంచనా విలువ రూ.609 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో బంజారా సరస్సును ఆనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె ఏర్పాటు చేసింది. దీని మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాం కాలం నాటి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లేఅవుట్‌లో ఈ స్థలం విక్రయానికి నోచుకోని ప్లాట్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పక్క స్థలాల యజమానులు దానిపై హక్కులు ప్రకటించడంతో వివాదం న్యాయస్థానానికి చేరింది.

ఈ భూమిని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని బంజారాహిల్స్ సరస్సు పరిరక్షణ కమిటీ సభ్యులు, స్థానికులు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సరస్సు పక్కన ఉన్న ఈ స్థలం చెత్త డంపింగ్‌ యార్డుగా మారడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని తెలిపారు. భూమిని పరిరక్షించడంతోపాటు పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులతో చర్చించిన హైడ్రా, కోర్టు వివాదం పరిష్కారమయ్యే వరకు ఆక్రమణలు జరగకుండా కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను అమర్చింది. కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం మామిళ్ల గ్రామ పరిధిలోని వెంకటాద్రినగర్‌లో 800 చదరపు గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా పరిరక్షించింది. 1975లో 7.20 ఎకరాల్లో రూపొందించిన 118 ప్లాట్ల లేఅవుట్‌లో ఈ స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అనంతరం పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు స్థానికులు ఆరోపించారు. ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు బ్యాంకు రుణం కూడా పొందినట్లు విచారణలో వెల్లడైంది.

రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పరిశీలించగా అది పార్కు స్థలమని గుర్తించారు. ఇదే సమయంలో మరో వ్యక్తి స్థలం చుట్టూ ప్రీకాస్ట్ గోడలు నిర్మించి ఆక్రమణలో ఉంచినట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం కూడా ఆ స్థలాన్ని పార్కు భూమిగానే నిర్ధారించినప్పటికీ ఆక్రమణ తొలగించలేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఆక్రమణలను తొలగించిన హైడ్రా, కంచెతోపాటు పార్కు స్థలంగా సూచించే బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మండలంలోని అనఘాపురి కాలనీలో ఒక్కొక్కటి 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు పార్కు స్థలాలను హైడ్రా స్వాధీనపరచుకుంది. 1980వ దశకంలో 16 ఎకరాల్లో రూపొందించిన 240 ప్లాట్ల లేఅవుట్‌లో ఈ రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. తర్వాత వాటిని ప్లాట్లుగా మార్చి ఆక్రమించినట్లు స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో అవి పార్కులకు కేటాయించిన స్థలాలేనని నిర్ధారించిన అధికారులు, ప్రీకాస్ట్ ఇటుకలతో నిర్మించిన వాచ్‌టవర్లను తొలగించారు. మొత్తం వెయ్యి చదరపు గజాల స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి, పార్కు భూమిగా సూచించే బోర్డులను అమర్చారు. ఈ స్థలాల అంచనా విలువ సుమారు రూ.6 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

సేఫ్ సిటీ ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష.. హైదరాబాద్ భద్రతకు పటిష్ట చర్యలు

సాంకేతికతతో నగర రక్షణ: పోలీస్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సేఫ్ సిటీ పనులు వేగవంతం

హైదరాబాద్ నగరంలో పట్టణ భద్రత, ప్రజా రక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన సేఫ్ సిటీ ప్రాజెక్టు అమలుపై డీజీపీ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. నలుగురు పోలీస్ కమీషనర్లు, ముగ్గురు మున్సిపల్ కమీషనర్లు, రవాణా శాఖ కమీషనర్ లతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో హైదరాబాద్ వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా భద్రతా వ్యూహాలను మెరుగుపరచడంపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికత, సమన్వయ చర్యల ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, కాలినడకన వెళ్లేవారితో పాటు ప్రతి పౌరుడికి సురక్షితమైన, స్మార్ట్ నగరాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో భాగంగా సాంకేతిక ఆధారిత పోలీసింగ్ పటిష్ఠతకు సంబంధించిన పలు కీలక అంశాలపై పురోగతిని పరిశీలించారు. అన్ని కమిషనరేట్లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, హెచ్డీ సీసీటీవీ నిఘాను గరిష్టంగా ఉపయోగించడం, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్మార్ట్ మానిటరింగ్ ద్వారా నేరాల నివారణ, అత్యవసర స్పందనను వేగవంతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఒకటో దశ కింద 2,306 సీసీ కెమెరాలు అందుబాటులో ఉండగా, రెండో దశలో మరో 862 కెమెరాల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని, నగరంలోని అన్ని కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

మహిళల సౌకర్యార్థం నగరంలో ఇప్పటికే 12 మొబైల్ షీ టాయిలెట్లు అందుబాటులో ఉండగా, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 12 జోన్లలో జోన్‌కు రెండు చొప్పున మరో 12 మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాలినడకన వెళ్లే వారి రక్షణ కోసం ప్రస్తుతం 77 ప్రాంతాలలో పెలికాన్ సిగ్నల్స్ (పాదచారుల సిగ్నల్స్) అందుబాటులో ఉన్నాయని, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి ట్రాఫిక్ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలోని మొత్తం 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతను జీహెచ్ఎంసీ చూస్తుందని, రద్దీగా ఉండే ప్రాంతాలలో పాదచారుల మౌలిక వసతులను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు.

ప్రజల్లో భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల నిరోధక చర్యలపై అవగాహన కల్పించేందుకు మొబైల్ ప్రచార వాహనాల వినియోగాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అందరికీ సురక్షితమైన, స్మార్ట్ హైదరాబాద్ కల సాకారమవుతుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఏపీ గ్రామీణ పాలనలో సరికొత్త చరిత్ర.. 23 పంచాయతీలకు అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాలనలో సరికొత్త మైలురాయి నమోదైంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐఎస్ఓ 9001:2015 ధృవీకరణను సాధించాయి. Gram Panchayats Achieve ISO Certification ఈ విశిష్ట ఘనత పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం రాష్ట్రానికే గర్వకారణమని అభివర్ణించిన ఆయన, ఇందుకు అంకితభావంతో పనిచేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

సుపరిపాలనకు అంతర్జాతీయ గుర్తింపు

ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పంచాయతీల్లో విస్తృతమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, రికార్డుల డిజిటలైజేషన్ వంటి పనులను విజయవంతంగా చేపట్టింది. అదేవిధంగా, తాగునీటి సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన వసతుల కల్పన, సమాచార బోర్డుల ఏర్పాటు, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమబద్ధమైన సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ వివరించారు.

ఏపీ గ్రామీణ పాలనలో సరికొత్త చరిత్ర..

ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక సాధారణ గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ఇది ఒక ప్రపంచ స్థాయి ప్రమాణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ 23 గ్రామ పంచాయతీలు సాధించిన ఘనత రాష్ట్రంలోని మిగిలిన 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలను అందిస్తూ, సరికొత్త పరిపాలనా ప్రమాణాలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *