తెలంగాణ

రూ.609 కోట్ల ప్రభుత్వ, పార్కు భూములకు హైడ్రా రక్షణ

హైదరాబాద్: నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్కు స్థలాల పరిరక్షణకు హైడ్రా HYDRA Protects చర్యలు చేపట్టింది. జూలై 16న బంజారాహిల్స్‌లోని బంజారా సరస్సు సమీపంలో 3.63 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు హయత్‌నగర్, బోడుప్పల్ ప్రాంతాల్లో మూడు పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడింది. రక్షణ చర్యలు చేపట్టిన భూముల మొత్తం అంచనా విలువ రూ.609 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో బంజారా సరస్సును ఆనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె ఏర్పాటు చేసింది. దీని మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాం కాలం నాటి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లేఅవుట్‌లో ఈ స్థలం విక్రయానికి నోచుకోని ప్లాట్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పక్క స్థలాల యజమానులు దానిపై హక్కులు ప్రకటించడంతో వివాదం న్యాయస్థానానికి చేరింది.

ఈ భూమిని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని బంజారాహిల్స్ సరస్సు పరిరక్షణ కమిటీ సభ్యులు, స్థానికులు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సరస్సు పక్కన ఉన్న ఈ స్థలం చెత్త డంపింగ్‌ యార్డుగా మారడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని తెలిపారు. భూమిని పరిరక్షించడంతోపాటు పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. సంబంధిత శాఖల క్షేత్రస్థాయి అధికారులతో చర్చించిన హైడ్రా, కోర్టు వివాదం పరిష్కారమయ్యే వరకు ఆక్రమణలు జరగకుండా కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను అమర్చింది. కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం మామిళ్ల గ్రామ పరిధిలోని వెంకటాద్రినగర్‌లో 800 చదరపు గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా పరిరక్షించింది. 1975లో 7.20 ఎకరాల్లో రూపొందించిన 118 ప్లాట్ల లేఅవుట్‌లో ఈ స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అనంతరం పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు స్థానికులు ఆరోపించారు. ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు బ్యాంకు రుణం కూడా పొందినట్లు విచారణలో వెల్లడైంది.

రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పరిశీలించగా అది పార్కు స్థలమని గుర్తించారు. ఇదే సమయంలో మరో వ్యక్తి స్థలం చుట్టూ ప్రీకాస్ట్ గోడలు నిర్మించి ఆక్రమణలో ఉంచినట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం కూడా ఆ స్థలాన్ని పార్కు భూమిగానే నిర్ధారించినప్పటికీ ఆక్రమణ తొలగించలేదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఆక్రమణలను తొలగించిన హైడ్రా, కంచెతోపాటు పార్కు స్థలంగా సూచించే బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మండలంలోని అనఘాపురి కాలనీలో ఒక్కొక్కటి 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు పార్కు స్థలాలను హైడ్రా స్వాధీనపరచుకుంది. 1980వ దశకంలో 16 ఎకరాల్లో రూపొందించిన 240 ప్లాట్ల లేఅవుట్‌లో ఈ రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. తర్వాత వాటిని ప్లాట్లుగా మార్చి ఆక్రమించినట్లు స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో అవి పార్కులకు కేటాయించిన స్థలాలేనని నిర్ధారించిన అధికారులు, ప్రీకాస్ట్ ఇటుకలతో నిర్మించిన వాచ్‌టవర్లను తొలగించారు. మొత్తం వెయ్యి చదరపు గజాల స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి, పార్కు భూమిగా సూచించే బోర్డులను అమర్చారు. ఈ స్థలాల అంచనా విలువ సుమారు రూ.6 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *