తెలంగాణ

సేఫ్ సిటీ ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష.. హైదరాబాద్ భద్రతకు పటిష్ట చర్యలు

సాంకేతికతతో నగర రక్షణ: పోలీస్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సేఫ్ సిటీ పనులు వేగవంతం

హైదరాబాద్ నగరంలో పట్టణ భద్రత, ప్రజా రక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన సేఫ్ సిటీ ప్రాజెక్టు అమలుపై డీజీపీ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. నలుగురు పోలీస్ కమీషనర్లు, ముగ్గురు మున్సిపల్ కమీషనర్లు, రవాణా శాఖ కమీషనర్ లతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో హైదరాబాద్ వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా భద్రతా వ్యూహాలను మెరుగుపరచడంపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికత, సమన్వయ చర్యల ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, కాలినడకన వెళ్లేవారితో పాటు ప్రతి పౌరుడికి సురక్షితమైన, స్మార్ట్ నగరాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో భాగంగా సాంకేతిక ఆధారిత పోలీసింగ్ పటిష్ఠతకు సంబంధించిన పలు కీలక అంశాలపై పురోగతిని పరిశీలించారు. అన్ని కమిషనరేట్లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, హెచ్డీ సీసీటీవీ నిఘాను గరిష్టంగా ఉపయోగించడం, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్మార్ట్ మానిటరింగ్ ద్వారా నేరాల నివారణ, అత్యవసర స్పందనను వేగవంతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఒకటో దశ కింద 2,306 సీసీ కెమెరాలు అందుబాటులో ఉండగా, రెండో దశలో మరో 862 కెమెరాల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని, నగరంలోని అన్ని కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

మహిళల సౌకర్యార్థం నగరంలో ఇప్పటికే 12 మొబైల్ షీ టాయిలెట్లు అందుబాటులో ఉండగా, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 12 జోన్లలో జోన్‌కు రెండు చొప్పున మరో 12 మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాలినడకన వెళ్లే వారి రక్షణ కోసం ప్రస్తుతం 77 ప్రాంతాలలో పెలికాన్ సిగ్నల్స్ (పాదచారుల సిగ్నల్స్) అందుబాటులో ఉన్నాయని, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి ట్రాఫిక్ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలోని మొత్తం 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతను జీహెచ్ఎంసీ చూస్తుందని, రద్దీగా ఉండే ప్రాంతాలలో పాదచారుల మౌలిక వసతులను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు.

ప్రజల్లో భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు మరియు మాదకద్రవ్యాల నిరోధక చర్యలపై అవగాహన కల్పించేందుకు మొబైల్ ప్రచార వాహనాల వినియోగాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అందరికీ సురక్షితమైన, స్మార్ట్ హైదరాబాద్ కల సాకారమవుతుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *