తెలంగాణ

భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డాటా సెంటర్: రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని సీఎం రేవంత్ పిలుపుAmazon Data Centre In Bharat Future City

హైదరాబాద్ శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రముఖ గ్లోబల్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ Amazon Data Centre నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం (15 జూలై 2026) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణను దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక మోడల్ డెవలప్‌మెంట్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం Bharat Future City పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 లో కుదుర్చుకున్న ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ప్రకారం రూ. 60,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఊపందుకుంది.

లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

రాబోయే 14 ఏళ్లలో 7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని అమెజాన్ ప్రకటించిన నిబద్ధతను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ అవసరాలకు ఇది సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెజాన్ సంస్థ రాష్ట్రంలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టాలని, అప్పుడే 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని వేగంగా చేరుకోగలమని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నెలవారీ సమీక్షలతో పనుల వేగం

పారిశ్రామికవేత్తలు, అమెజాన్ సంస్థ తమ వ్యాపార విస్తరణ కోసం కోరిన విజ్ఞప్తులను పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇందుకోసం ప్రతి నెల సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. అమెజాన్ సంస్థ ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణ రావు నేతృత్వంలో ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారుస్తామని, ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడానికి అమెజాన్ ఇక్కడ ఒక యాంకర్ పరిశ్రమగా నిలుస్తుందని వివరించారు.

పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక పాలసీలు

గతంలో ఉన్న పాలసీ పక్షపాతం, అనుకూలమైన వారికే అనుమతులు ఇచ్చే పద్ధతుల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి విమర్శించారు. అందుకే ఇన్వెస్టర్ల ఇబ్బందులను తొలగించడానికి హెల్త్, ఎడ్యుకేషన్ వంటి వివిధ రంగాల కోసం ప్రత్యేక విధానాలతో కూడిన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా సహా పలువురు నిపుణుల భాగస్వామ్యంతో రూపొందించిన ఈ విధానం ద్వారా సింగిల్ విండో సిస్టమ్‌ను ఏర్పాటు చేసి, ఆలస్యం లేకుండా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వికసిత్ భారత్ 2047 ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంలో తెలంగాణ కనీసం 10 శాతం అంటే 3 ట్రిలియన్ డాలర్ల వాటాను అందిస్తుందని స్పష్టం చేశారు.

కాలుష్య రహిత ప్రణాళికలతో ముందడుగు

మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు తెలంగాణకు రాకుండా ఉండేందుకు రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) రీజియన్లుగా విభజించి లేయర్డ్ డెవలప్‌మెంట్‌ను చేపడుతున్నామని సీఎం వివరించారు. చైనాతో పోటీ పడేలా ఇన్వెస్టర్లకు ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇందుకు పరిశ్రమల మద్దతు కావాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచిందని పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం కేవలం నియంత్రణాధికారిగా కాకుండా పరిశ్రమలకు ఒక ఫెసిలిటేటర్‌గా పనిచేస్తుందని చెప్పారు. డాటా సెంటర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అలూరులో నిరంతర విద్యుత్, నీటి సరఫరాతో కూడిన డాటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో అమెజాన్ వంటి భాగస్వాములు ఎంతో కీలకమని ఆయన అన్నారు.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *