తస్లీమా నస్రీన్ కోల్కతా పునరాగమనం: 19 ఏళ్ల తర్వాత బెంగాల్లో మారిన రాజకీయాలు / Taslima Nasrin Returns to Kolkata After 19 Years Amid Shifting Bengal Politics
తస్లీమా నస్రీన్.. రెండు దశాబ్దాల క్రితం తన పదునైన వ్యాఖ్యలు, నిర్భయమైన రచనలతో యావత్తు దేశాన్ని ఆందోళనలోకి నెట్టిన రచయిత్రి. తన మనసులోని మాటలను పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన నాటి ఘటనలు, ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి, సమాజంలో ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ క్రమంలోనే ఆమె తాను ఎంతో ప్రేమించిన కోల్కతా నగరాన్ని బలవంతంగా విడిచి వెళ్లాల్సి వచ్చింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి నిదర్శనంగా, దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ తనకి అత్యంత ప్రీతిపాత్రమైన బెంగాల్ గడ్డపై అడుగుపెట్టారు.
కోల్కతాలో ఘన స్వాగతం, భావోద్వేగ వ్యాఖ్యలు
ది హిందూ నివేదిక ప్రకారం, శుక్రవారం (జూలై 31) నాడు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తస్లీమా నస్రీన్కు ఘన స్వాగతం లభించింది. శనివారం రబీంద్ర సదన్లో జరగనున్న మత ఛాందసవాద వ్యతిరేక సాహిత్య కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. గతంలో ఆమె మాట్లాడుతూ, “నా హృదయంలో బెంగాల్ను సరిహద్దులు ఎప్పుడూ విభజించలేదు. బెంగాల్ తూర్పు భాగం (బంగ్లాదేశ్) నా ముందుకు మూసుకుపోవడంతో, ప్రస్తుతం బెంగాల్లోని ఈ భాగమే నా ఇల్లు” అని భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు మత ఛాందసవాదులు అణచివేయాలని చూసిన గొంతు మళ్లీ తిరిగి రావడానికి ఈ పర్యటన ఒక ప్రతీక అని ఆమె తాజాగా పేర్కొన్నారు.
వివాదాలు, నిషేధం, సుదీర్ఘ ప్రవాస చరిత్ర
ఈ పునరాగమనం వెనుక సుదీర్ఘమైన, నాటకీయమైన చరిత్ర ఉంది. 1994లో ‘లజ్జ’ నవల కారణంగా ప్రాణహాని బెదిరింపులు రావడంతో ఆమె బంగ్లాదేశ్ను విడిచిపెట్టారు. ఆ తర్వాత 2004లో కోల్కతాలో స్థిరపడి, ఆ నగరాన్ని తన సాంస్కృతిక ఆశ్రయంగా భావించారు. కానీ ఆమె ఆత్మకథ ‘ద్విఖండితో’ ముస్లిం వర్గాల మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో అప్పటి వామపక్ష ప్రభుత్వం 2003లోనే ఆ పుస్తకాన్ని నిషేధించింది. అనంతరం 2007 నవంబర్లో కోల్కతాలో తీవ్ర హింసాత్మక నిరసనలు చెలరేగడంతో పరిస్థితిని అదుపు చేయడానికి సైన్యాన్ని సైతం మోహరించాల్సి వచ్చింది. ఆ సమయంలో అప్పటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం శాంతిభద్రతల నెపంతో ఆమెను నగరం విడిచి వెళ్లాలని కోరింది. ఆ విధంగా మొదట జైపూర్, ఆ తర్వాత ఢిల్లీ, విదేశాలకు వెళ్లిన ఆమె, దాదాపు రెండు దశాబ్దాల పాటు కోల్కతాకు తిరిగి రాలేకపోయారు.
బెంగాల్ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ
అయితే ఇప్పుడు ఆమె రాక పశ్చిమ బెంగాల్లో తీవ్ర రాజకీయ ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడం, బీజేపీ నాయకుడు సమిక్ భట్టాచార్య గతంలో ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి ఆమె పునరాగమనానికి సహకారం కోరడం వంటి పరిణామాలు ఈ పర్యటనకు ప్రాధాన్యం తెచ్చిపెట్టాయి. గతంలో వామపక్ష, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను రక్షించడంలో విఫలమాయ్యాయని, ప్రస్తుత పరిణామాలు ఆ నాటి చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడమేనని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆనాడు మత ఘర్షణలు తీవ్రమవుతున్న సమయంలో శాంతిభద్రతల రక్షణ కోసమే పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నామని నాటి ప్రభుత్వాల వర్గాలు వాదిస్తున్నాయి.
బీజేపీ సిద్ధాంత కోణం, రాజకీయ ప్రాధాన్యం
ఈ పరిణామం వెనుక ఉన్న రాజకీయ, సిద్ధాంత కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించే బీజేపీ, తస్లీమా నస్రీన్ విషయాన్ని సుదీర్ఘకాలంగా ఒక ప్రధాన అంశంగా లేవనెత్తుతోంది. ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ఎండగట్టిన ఒక రచయిత్రికి అప్పట్లో వామపక్ష, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రక్షణ కల్పించలేకపోయాయని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆమెను కోల్కతా నుంచి పంపివేశారని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఆమెకు మళ్లీ బెంగాల్లో సాదర స్వాగతం లభించేలా చూడటం ద్వారా భావప్రకటనా స్వేచ్ఛతో పాటు మతమౌఢ్యానికి వ్యతిరేకంగా తాము కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని జాతీయ స్థాయిలో పంపడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సాహిత్య వేదికపై భావప్రకటనా స్వేచ్ఛ సందేశం!
రబీంద్ర సదన్లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ్, పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సహా పలువురు పాల్గొనే అవకాశం ఉంది. ఈ వేదికపై తస్లీమా తన కవితలను చదవనున్నారు. ప్రభుత్వంలో ఏ సిద్ధాంతానికి చెందిన పార్టీ ఉన్నప్పటికీ, రచయిత భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కుగా కొనసాగాలని ఆమె స్పష్టం చేశారు. తనకు ఆశ్రయం ఇచ్చిన నగరమే ఒకప్పుడు ప్రవాసానికి కారణమైన వేళ, దాదాపు 19 ఏళ్ల తర్వాత తస్లీమా నస్రీన్ కోల్కతాకు తిరిగి రావడం రాష్ట్ర ఆధునిక రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో మరో కీలక అధ్యాయానికి తెరలేపినట్లయింది.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST

మరి అట్లుంటుంది ఎన్డీఏ రాజకీయాలంటే ఏం చేస్తాం తప్పదు