తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం
సీఎం జోసెఫ్ విజయ్ కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తుల ప్రత్యక్షం..
ఉన్నత విద్యాశాఖ మంత్రిపై తీవ్ర ఆరోపణలు..
గవర్నర్కు వినతిపత్రాలు సమర్పించిన బీజేపీ నాయకత్వం
తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెద్ద దుమారం రేగింది. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తూ నేరుగా గవర్నర్ రంగంలోకి దించింది. చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో భేటీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ బృందం, ప్రభుత్వంపై రెండు ముఖ్యమైన ఫిర్యాదులను అందజేసింది. అత్యంత రహస్యంగా సాగాల్సిన ప్రభుత్వ కీలక సమావేశంలోకి బయటి వ్యక్తులు రావడం, అలాగే ఒక మంత్రిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.
గవర్నర్ను కలిసిన అనంతరం నైనార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, జూన్ 5వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాన్ అరోకియాసామి, విష్ణు రెడ్డి అనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు పాల్గొన్నారని ఆరోపించారు. సాధారణంగా ప్రభుత్వ రహస్య నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశాల్లోకి మంత్రులు, ఉన్నతాధికారులు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు. కానీ, ఇలా బయటి వ్యక్తులను కూర్చోబెట్టడం చట్టవిరుద్ధమని, ఇది మంత్రులు తీసుకునే రహస్య ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని బీజేపీ వాదిస్తోంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరింది.
మంత్రివర్గ సమావేశం వివాదంతో పాటు మరో షాకింగ్ అంశాన్ని కూడా బీజేపీ బృందం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ ఒక మైనర్ బాలిక పట్ల తప్పుగా ప్రవర్తించారంటూ మరో ఫిర్యాదును సమర్పించింది. ఈ తీవ్రమైన ఆరోపణపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒకవైపు ప్రభుత్వ రహస్యాల ఉల్లంఘన, మరోవైపు మంత్రిపై వచ్చిన ఆరోపణలతో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ వ్యవహారాలపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
